తాత్పర్యము: మంగళ కరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థములను సాధించి, శరణు జొచ్చిన వారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ! పార్వతీ, ఓ! దుర్గాదేవీ, ఓ! నారాయణీ,నీకు నమస్కరిస్తున్నాను.
{ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను.}
(మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం)
ఓం భూః ఓం భువః ఓగ్ సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్
కారణము: (గృహస్థులు ఐదు వ్రేళ్ళతోను ముక్కును పట్టుకుని ఎడమరంధ్రం ద్వారా గాలిని పీల్చి, ఓం భూ: నుండి భూర్భువస్సువరోం వరకు మంత్రము చదివేంతకాలము గాలిని బంధించి తర్వాత మెల్లగా గాలిని కుడి ముక్కు రంధ్రం ద్వారావిడువ వలెను. దీనినే పూరకం, కుంభకం, రేచకం అందురు. మంత్రం చదివే సమయంలో గాలిని బంధించుటను ప్రాణాయామము అందురు. బ్రహ్మచారులు బొటన వ్రేలు, చిటికెన వ్రేళ్ళతో దీనిని చేయవలెను.)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః
(అని నాలుగు దిక్కులా ఉద్ధరని తో నీళ్ళు చల్లవలెను. సుద్ధి చేసినట్టుగా)
సంకల్పము:
(ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏమి కోరి,ఏ పని చేస్తున్నారో స్పష్టముగా చెప్పుకొనుటను సంకల్పము అందురు.మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే,కలియుగే, ప్రధమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే,…….. నదీ సమీపే………( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ…………….నామ సంవత్సరే,…………… (దక్షిణాయనే), ……..(వర్ష)ఋతౌ,……… (భాద్రపద)మాసే,………(శుక్ల)పక్షే,..…..(చతుర్థ్యాం) తిథి ………………. వాసరే,శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం ,శుభతిధౌ శ్రీమాన్………… గోత్ర: ……….నామధేయ: ధర్మపత్నీ……………… సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. (నీరు ముట్టుకొనవలెను)
సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను. గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు.తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు. ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. అతడు అజేయుడైనాడు.
భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు. గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు. విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది, తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు అయినా మాట తప్పుట కుదరదు, కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది,నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు. శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు.
అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది. తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది. దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది. ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది.శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు
జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:
గణేశుడు అగ్రపూజనీయుడు
ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు గజాననుడుమిగిలిపోయినాడు త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించినాడు వినాయకుని బుద్ది సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు. వినాయకునికే ఆధిపత్యము లభించినది
చంద్రుని పరిహాసం
గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు ఆతని మాన్యత నశించింది నింద్యుడయినాడు ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి.అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు నిందలకు గురియగుతారు.చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించినారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించినాడు.
ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడినది.
శ్యమంతకోపాఖ్యానముచంద్ర దర్శనం, నీలాపనింద:
ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించినది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించినాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించినాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది.
నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.అడవిలో అన్వేషణ సాగించినాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించినది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఓక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.
అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించినాడు.
అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్దమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్దము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.
శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు.నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.
వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చినాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.
పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు... సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకఃసింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.
ప్రతి
సంవత్సరమును భాద్రపద శుద్ధ చతుర్ధి యందు దేవతులు, మహర్షులు, మానవులు
మున్నగువారందరు తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్టసిద్ధి గాంచుచు
సుఖంబుగ నుండిరని శాపమోక్షప్రకారంబు శౌనకాది మునులకు వినిపించి సూత మహాముని
వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగెను.
తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!